Friday, August 29, 2014

గుండమ్మ కథ అధ్యాయం - 3 : ఘంటయ్య - అందరి బంధువయ్య

గుండమ్మ కథ... ఒక కుటుంబ సమేతంగా చూడగలిగిన రెండు కుటుంబాల కథా చిత్రం. ఇంకో రకంగా వర్ణించాలంటే అహింసాత్మక చిత్రం కుడా. మరి ఇలాంటి అహింసా మార్గం లో కథ చెప్పాలంటే దానికి ఒక పెద్ద అడ్డంకి ని దాటాలి. అదే ప్రతి-నాయకుడు పాత్ర. ఏ కుటుంబ కథా చిత్రానికైనా ఈ ప్రతినాయకుడి ప్రభావం చాలా ఉంటుంది. ఇక్కడ ఒక సౌలభ్యమో లేకా సంప్రదాయమో మరి, చిత్రం యొక్క తరహా మరియు ప్రతి-నాయకుడి వ్యవహారశైలి ఒకదానిపై ఒకటి ఆధార పడి ఉంటాయి.

అంటే, హాస్య ప్రధానమైన చిత్రానికి అమాయకపు ప్రతి-నాయకుడు, లేదా ప్రతి-నాయకుడు అమాయకుడు అయితే ఆ చిత్రం హాస్య ప్రధానంగా ఉండటం జరుగుతుంది. మిగితా చిత్రాల్లో కథానాయకుడి పైన కూడా చిత్రం యొక్క తరహా ఆధారపడి ఉంటుంది. కాని, కుటుంబ కథా చిత్రానికి ప్రతి-నాయకుడి పాత్రే ఆ తరహా ని ఎక్కువగా నిర్దేశిస్తుంది అని నా అభిప్రాయం.

ఉదాహరణకు, 'ఏప్రిల్ ఒకటి విడుదల' చిత్రం గమనిస్తే హీరో సరదా మనిషే కాని విలన్, మన కృష్ణ భగవాన్ చాలా సీరియస్ పాత్ర. అందుకే చివరి 10-20 నిమిషాల్లో కథ హాస్యానికి దూరంగా, సస్పెన్స్ - సెంటిమెంట్ కి దగ్గరా వెళ్తుంది. ఇంక మన శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఇది బాగా గమనిన్చోచు. రెడీ & కింగ్ లో విలన్స్ కాస్త అమాయకులు కనుకే హీరో వాళ్ళతో ఆడుకుంటాడు, హాస్యాన్ని పండిస్తాడు. అదే గుడుంబా శంకర్ లో పవన్ కళ్యాణ్ , ఆట లో సిద్ధార్థ్ చేసారు. విలన్ క్యారెక్టర్ ప్రభావం కథ పైనా హీరో క్యారెక్టర్ పై ఉంటుంది అనే పాయింట్ చెప్పడానికే ఈ ప్రయత్నం.

అదే కుటుంబ కథా చిత్రాల్లో ప్రతి-నాయకుడు హాస్యానికి దూరంగా, దయ-జాలి-కరుణ లేని కర్కోటకుడికి దగ్గరగా ఉంటే, ఇక ఆ కథ, విషాద గాదే.  దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

రెండు కత్తి మీద సామే. హాస్యం - విషాదం. అందుకే మనం రెండింటిని సగం సగం వాడుకుంటాం. చిత్రం మొదటి భాగం - హాస్యం. రెండో భాగం - విషాదం. చివరిలో హీరో వీరోచితం. ఇలాంటి తరహా లోనే చాలా చిత్రాలు వచ్చాయి.. ఇప్పుడు నాకు ఉదాహరణ కు గుర్తొస్తోంది నువ్వు- నేను. మీకు ఇంకా ఏవైనా అలాంటి తరహా చిత్రాలు గుర్తొస్తే చాలా సంతోషం.

మరో విషయం. ఈ ప్రతి-నాయకుడు సాధారనంగా ఆ కుటంబం లోనే ఉంటాడు. ఆ బంధువే రాబంధై పీక్కుతినాలని ప్రయత్నిస్తుంటాడు.

ఇక మన గుండమ్మ కథ లో ఆ ప్రతి-నాయకుడి పాత్ర చెప్పాలంటే అది రమణారెడ్డి గారి ఘంటయ్య పాత్ర. గుండమ్మ కూతురిని తన కొడుకు కి ఇవ్వాలనేది  అతని లక్ష్యం. అందుకోసం సర్వ శక్తులు - యుక్తులు ధారపోస్తాడు. కాని ప్రతి- నాయకుడు కదా అందుకే సఫలీకృతం కాలేకపోతాడు.

అయితే, ఇక్కడ మన ఘంటయ్య గురించి చెప్పలంటే తను కాస్త జిత్తులు మారి ఎత్తులు వేయగల తెలివైన 'అమాయకుడు'. వివరంగా చెప్పాలంటే, నిజానికి గుండమ్మ కూతురి పెళ్లి వేరే వాళ్ళతో జరగకుండా వాటిని భంగం చేయగల సామర్థ్యం ఉన్న తెలివైన వాడు. కాని ఎప్పుడైతే N.T.R ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఘంటయ్య ఎత్తులను చిత్తు చేయడం మొదలు పెడతాడో అప్పుడు తను చాలా అమాయకుడు అని మనకు అర్థం అవుతుంది. ఇలా అమాయకంగా ఎత్తులు వేస్తూ చిత్తు అవుతుండటం వల్లే మనకు ఘంటయ్య పాత్ర నవ్వులు పుట్టిస్తుంది.

ఒక పాత్ర ని డిఫైన్ చేయడం సులభం కాని అలాంటి పాత్ర కథ లో ఏం చేస్తాడు, ఎలా కథ కి తన ప్రభావం చూపుతాడు అనేది కష్టం ఎందుకంటే దానిమీదే రచయిత విజయం తద్వారా సినిమా విజయం ఆధారపడి ఉంటాయి.
మన ఘంటయ్య నిజానికి విశ్వప్రయత్నాలు చేసాడనే చెప్పాలి. వాటిని ఒకసారి చూస్తే, ఎలా కథా నాయకుడికి అడ్డంకులను సృష్టించవచ్చో తెలుస్తుంది.

ముందు చెప్పినట్టుగా మన ఘంటయ్య, గుండమ్మ కూతురి సంబంధాలు చెడగోట్టడమే ప్రధాన కర్తవ్యం. అది చాల దిగ్విజయంగా చేస్తుంటాడు. గుండమ్మ ని ఇబ్బంది పెడుతుంటాడు. అందులో  తనకు మొదటి ఓటమి ఎదురయ్యేది S.V.R వాల్ల. అందరి దగ్గర చెప్పినట్టే S.V.R దగ్గర కూడా, గుండమ్మ గురించి, జమున గురించి  లేనిపోనివి అన్ని చెప్తాడు ఘంటయ్య. కాని S.V.R  అవేవి పట్టించుకోక ముందుకు వెళ్తాడు (ఎందుకంటే S.V.R  కి ఘంటయ్య గురించి ముందే, గుండమ్మ కూతురి పెళ్లి సంబంధం తెచ్చిన పురోహితుడి ద్వారా తెలుస్తుంది). అది ఘంటయ్య మొదటి ప్రధాన ప్రయత్నం మరియు మొదటి ఓటమి.

రెండో ప్రయత్నం, జమున A.N.R తో తిరగడం గమనించి అది వాళ్ళ పెళ్ళికి దారి తీస్తుందేమో అని గుండమ్మ దగ్గర అవి చెప్పి వాళ్ళిద్దరిని దూరం చేయాలని చూస్తాడు. ఇది రెండో ప్రధానమైన ప్రయత్నం. కాని ఈసారి N.T.R అడ్డుకోవడం వల్ల, తను గుండమ్మ ని ఒప్పించడం వల్ల, ఘంటయ్య ప్రయత్నం వృధా అవుతుంది. ఇది రెండో ఓటమి.

మూడోసారి, S.V.R తనకు గుండమ్మ సంభందం ఇష్టం లేదని, A.N.R జమున వివాహం జరిగితే తను ఆస్తి వాళ్ళకు ఇవ్వనని ఉత్తరం రాస్తాడు. అప్పుడు ఘంటయ్య ఇంకా పెళ్లి జరగదని జరిపించోద్దని గుండమ్మ కి చెప్తాడు. మళ్ళి మన N.T.R తన మాటలతో గుండమ్మ ని ఒప్పించి పెళ్లి కి ఒప్పిస్తాడు - మూడో ఓటమి.

నాలుగు - హరినాథ్-పద్మ పెళ్లి మాటలకి వెళ్ళినప్పుడు కూడా, కట్నం అంటూ అది ఇది అంటూ గుండమ్మ గురించి ఏదేదో చెప్తూ పెళ్లి సంబంధం కుదరకుండా ఉండేలా ప్రయత్నిస్తాడు. ఇది మళ్లి N.T.R భగ్నం చేస్తాడు తన మాటలతో - నాలుగో ఓటమి.

చివరిగా, ఛాయాదేవి గుండమ్మ తో గొడవ పడేటప్పుడు, ఘంటయ్య గుండమ్మ కు సహకరించక ఛాయాదేవి తో  కలుపుతాడు. ఇది ఒక్కటే తన అసలు కోరిక కోసం. పైవి పెళ్లి కోసమే అయినా, ఆ పెళ్లి గుండమ్మ ఆస్తి పొందాలనే కదా. ఇప్పుడు ఆ  ఛాయాదేవి చేతిలో ఉంది. కనుక తను ఛాయాదేవి వైపు వచ్చేసి గుండమ్మ ను కష్టాల్లో తోశాడు.
అయితే సావిత్రి N.T.R క్లైమాక్స్ లో వచ్చి గుండమ్మ ను తమ తో తీసుకెళ్ళి  పోవడం తో అన్ని ముగిసిపోతాయి.

అయితే ఆ క్లైమాక్స్  వచ్చే ముందు ఘంటయ్య కొడుకు రాజనాల  రంగప్రవేశం చేయడం తో ఘంటయ్య మెల్లగా పక్కకు వెళ్ళిపోతాడు. ఇలా తన చెడు ఆలోచనకు తన తెలివి తో ప్రయత్నించినా అవి ఫలించక ప్రేక్షకులను ఫక్కున నవ్వేలా చేసేలా రచించారు  రచయిత. ఇది మన ఘంటయ్య!

- సాయి కిరణ్  

No comments:

Post a Comment